end

బిహార్‌ జేడీయూ కూటమిదే..

  • 124 సీట్లతో ఎన్డీయే విజయం
    76 స్థానాల్లో ఆర్జేడీ గెలుపు
    లెఫ్ట్‌ పార్టీల జోరు.. చతికిలపడిన కాంగ్రెస్‌
    5 స్థానాల్లో సత్తా చాటిన మజ్లిస్‌

పట్నా: చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల హోరాహోరీ పోరులో చివరకు అధికార ఎన్డీయే విక్టరీ కొట్టింది. చివరి వరకు గట్టి పోటీ ఇచ్చిన ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి విజయానికి కొద్ది దూరంలో నిలిచిపోయింది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ మంగళవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. చివరకు, మొత్తం 243 స్థానాల అసెంబ్లీలో మెజారిటీ మార్క్‌ 122 కాగా, అంతకన్నా కేవలం రెండు సీట్లు ఎక్కువ గెలుచుకుని 124 సీట్లతో ఎన్డీయే అధికారంలోకి రానుంది. అయితే, అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా ఆర్జేడీ నిలిచింది. ఆ పార్టీ అత్యధికంగా 76 స్థానాలు గెలుచుకుంది. రెండో స్థానంలో 73 సీట్లతో బీజేపీ నిలిచింది. గత ఎన్నికల్లో 71 సీట్లు గెలుచుకున్న ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ పార్టీ జేడీయూ ఈ సారి 43 స్థానాలకే పరిమితమైంది.

కూటముల వారీగా చూస్తే.. అధికార ఎన్డీయేలో.. బీజేపీ 73, జేడీయూ 43, వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీ(వీఐపీ) 4, హెచ్‌ఏఎం 4 స్థానాలు గెలుచుకున్నాయి. విపక్ష మహా కూటమిలో ఆర్జేడీ 76, కాంగ్రెస్‌ 19, లెఫ్ట్‌ పార్టీలు 16 సీట్లలో విజయం సాధించాయి. మొత్తంగా మహా కూటమికి 111 స్థానాలు వచ్చాయి. ఎంఐఎం 5, ఇండిపెండెంట్‌ 1, ఎల్జేపీ 1, బీఎస్పీ 1 స్థానాల్లో గెలుపొందాయి. విజయం మహా కూటమిదేనని, కాబోయే ముఖ్యమంత్రి తేజస్వీ యాదవేనని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. కానీ వాటి అంచనాను తలక్రిందులు చేస్తూ ఎన్డీయే విజయం సాధించింది.

Exit mobile version