end

Good Deeds:శుభకార్యం చేసిన తరువాత దర్భలు, నువ్వులు తాకకూడదా?

దర్భలు(Darbhas) ఎప్పుడూ పవిత్రమైనవే. దర్భను తాక కూడదని చెప్పే సందర్భం ఒక్కటీ లేదు. అశుచి నుంచి మనల్ని బయటపడేసేది దర్భయే. ఇంటిలో ఏదైనా పెద్ద శుభకార్యం చేసిన కొద్దికాలానికే పెద్దలకు సంవత్సరీకాలు, తద్దినాలు(Taddinas) పెట్టుకోవాల్సి వస్తే నువ్వులు(Sesame seeds) తాకకపోవడం మాత్రం కనిపిస్తుంది. నువ్వులకు బదులుగా వాడేవేవీ సరైన ప్రత్యామ్నాయాలు కావు. పితృకార్యం చేయవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా నువ్వులనే ఉపయోగించాలి. అందులోనూ తల్లిదండ్రులకు శ్రాద్ధకర్మలు నిర్వహించవలసి వచ్చినప్పుడు అసలు మానివేయకూడదు.

కొత్త వస్ర్తానికి పసుపు ఎందుకు పెడతారు?

ప్రతి మంచిపనిలోనూ పసుపును విరివిగా వినియోగిస్తారు మనవాళ్లు. శుభకార్యాలలో, యజ్ఞదీక్షా సమయాల్లో వస్ర్తాలను పసుపు నీళ్లలో ముంచి ఆరవేయడం ఆచారం. తడిపి ఆరవేసిన వస్ర్తాలను ఇతరులకు ఇవ్వకూడదు. నూతన వస్ర్తాలే(New Clothes) ఇవ్వాలి. పసుపునీళ్లతో తడిపితే ఆ వస్ర్తాలు పాతవైపోతాయి. అందుకే పసుపునీళ్లలో తడిపిన ఫలం కోసం ఇతరులకు కొత్తబట్టలు పెట్టేటప్పుడు పసుపు బొట్టు పెడతారు. ఇలా చేయడం మంగళకరంగా భావిస్తారు. పసుపు క్రిమిసంహారిణీ(Insecticide). అనేక చేతులు మారి వచ్చే కొత్తబట్టల్లో ఎటువంటి క్రిములున్నా పసుపు(Turmeric) నివారిస్తుంది. అప్పటికప్పుడు కట్టుకున్నా ఎటువంటి అనారోగ్యం కలగకుండా ఉంటుంది.

కొబ్బరికాయ కొట్టిన తరువాత పీచు ఎందుకు తీస్తారు?

కొబ్బరికాయకు(Coconut) పీచు క్రిందిభాగంలో మూడు కళ్లుంటాయి. ఆ కళ్లున్న ప్రదేశం సున్నితంగా ఉంటుంది. అక్కడ గోటీతో గిచ్చినా నీళ్లు బయటకు వచ్చేస్తాయి. కొబ్బరిపీచును పూర్తిగా తీసినట్లయితే నీళ్లు కారిపోయే అవకాశం ఉంటుంది. అందుకే కళ్లున్న వైపు పిలకలా పీచును విడిచిపెడతారు. అరటి వంటి పళ్లను కొద్దిగా వలిచి నివేదన చేస్తాం. భగవంతుడు తినడానికి సిద్ధంగా చేసివ్వడమన్నమాట. అందుకే పిలకతో ఉన్న కొబ్బరికాయను పగలకొట్టి, ఆ పైన పిలక తీసివేసి నివేదన చేస్తాం.

Exit mobile version