కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు భారీ షాక్ ఇచ్చింది. గృహ వినియోగదారులు ఉపయోగించే ఎల్పిజీ సిలిండర్పై సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసింది. గురువారం ఆయిల్ సెక్రటరీ పంకజ్ జైన్ మీడియాకు వెల్లడించారు. కేవలం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీని పరిమితం చేసింది. ఇక సాధారణ ప్రజలు 100 శాతం మార్కెట్ ధరకే గ్యాస్ సిలిండర్ కొనాల్సి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ముడి చమురు, గ్యాస్ కొరత వల్ల దేశంలో సబ్సిడీ ఇవ్వడం కుదరని ఆయన తేల్చి చెప్పారు. కొవిడ్ ప్రారంభమైన రెండు సంవత్సరాల నుండి సబ్సిడీని తగ్గిస్తూ ఇక పూర్తిగా వంట గ్యాస్పై 100 శాతం సబ్సిడీ ఎత్తివేయడం జరిగింది.
గృహ వినియోగదారులు వాడే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1003 ఉంది. అయితే ఉజ్వల పథకం లబ్దిదారులకు రూ.200 సబ్సిడీ అందించనున్నారు. సబ్సిడీ మొత్తాన్ని లబ్దిదారుల బ్యాంకు ఖాతాలో జమచేయనున్నారు. ఏడాదికి 12 సిలిండర్లకు రూ.200 చొప్పున ఉజ్వల లబ్దిదారులకు లాభం చేకూరనుంది. దేశ వ్యాప్తంగా 30.5 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా 9 కోట్ల ఉజ్వల పథకం కనెక్షన్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల నుండి ఎలాంటి స్పందన లభిస్తుందో, ఎలాంటి గందరగోళానికి దారితీస్తుందో చూడాలి.