end

హైవేపై ఢీకొన్న డబుల్ డెక్కర్ బస్సులు

ఉత్తరప్రదేశ్ పూర్వాంచల్ ఎక్స్‌ప్రైస్ హైవేపై ఈ రోజు ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. రెండు డబుల్ డెక్కర్ బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మంది తీవ్రగాయాల పాలయ్యారు. గాయపడిన వారందర్నీ దగ్గరలోని హైదర్‌గడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌‌కి తరలించారు. తీవ్రంగా గాయపడిన 20 మందిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో లక్నోలోని ట్రామా సెంటర్‌కి తరలించారు. ఘటనపై ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

బిహార్ నుంచి ఢిల్లీ వెళ్తున్న రెండు డబుల్ డెక్కర్ బస్సులు లోనికత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ్‌పూర్ గ్రామ పరిధిలో ఒకదానితో ఒకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ముందు వెళ్తున్న బస్సు సడెన్ బ్రేక్ వేడయంతో వెనుక వస్తున్న బస్సు వేగాన్ని అదుపు చేయలేక ఢీకొందని అక్కడ ఉన్నవారు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్‌తో పాటు బారబంకి పోలీసు ఉన్నతాధికారులు కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు.

ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ స్పందిస్తూ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం చాలా బాధాకరమంటూ ట్వీట్ చేశారు. సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేసారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలని యోగీ ఆదిత్యానాథ్ ప్రార్థించారు.

Exit mobile version