నిజాం కాలం నుంచి 1980 కాలం వరకు భాగ్యనగరంలో డబుల్ డెక్కర్ బస్సులు రయ్ రయ్ మంటూ తిరిగేవి. ఎత్తుగా ఉండే ఆ బస్సులో ప్రయాణం.. ప్రయాణీకులకు ఆహ్లాదకరంగా ఉండేది. కాలక్రమేణా అవి కనుమరుగయ్యాయనుకోండి. తాజాగా షాకీర్ హుస్సేన్ అనే ఓ వ్యక్తి డబుల్ డెక్కర్ బస్సులను గుర్తు చేస్తూ మంత్రి కేటీఆర్కు ట్యాగ్ చేయడంతో వాటిపై మళ్లీ చర్చ మొదలైంది. ఒకప్పుడు జూపార్క్ నుంచి హైకోర్టు, అఫ్జల్గంజ్, అబిడ్స్, హుస్సేన్ సాగర్, రాణిగంజ్ మీదుగా సికింద్రాబాద్ వరకు బస్సులు తిరిగేవనీ, ఇప్పుడు మళ్లీ అలాంటి బస్సులను ప్రయాణికులు లేదా టూరిస్టుల కోసం తీసుకురావాలని కేటీఆర్ను కోరుతూ ట్వీట్ చేశారు.
ఈ అంశంపై ట్విట్టర్ ద్వారా స్పందించిన మినిస్టర్ కేటీఆర్.. అబిడ్స్లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో తాను చదువుకునే రోజుల్లో ఆ దారిగుండా వెళ్తున్నప్పుడు డబుల్ డెక్కర్ బస్సులు కనిపించేవని, వాటి జ్ఞాపకాలు మీరు మళ్లీ గుర్తు చేశారని తెలిపారు. అయితే ఆ బస్సులను ఎందుకు పూర్తిగా ఆపేశారో తనకు తెలియదన్న మంత్రి.. మళ్లీ హైదారాబాద్ రోడ్లపైకి డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ను అడిగారు. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా కేటీఆర్ వారికి సూచించారు.