end

ఎగ్జిట్ పోల్స్ ఎవరికి అనుకూలం

హైదరాబాద్: రెండు రోజుల క్రితం జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించి మేయర్‌ పీఠం దక్కించుకుంటుందో రేపటి వరకు ఎదురుచూడాల్సిందే. కాగా, ఎన్నికల కోడ్ముగియడంతో ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఆయా సర్వే సంస్థలు గురువారం సాయంత్రం వెల్లడించాయి. ఓల్డ్ మలక్‌పేట్‌లో గుర్తులు తారుమారైన కారణంగా రీపోలింగ్ జరిగింది. రీపోలింగ్ ముగిసేవరకూ ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించేందుకు అనుమతి లేకపోవడంతో.. డిసెంబర్ 1 సాయంత్రం వెల్లడి కావాల్సిన ఎగ్జిట్ పోల్స్‌‌ను తాజాగా వెల్లడించారు.

తాజాగా వెల్లడైన ఎగ్జిట్‌పోల్స్ ప్రకారం.. టీఆర్‌ఎస్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ముందంజలో ఉంది. టీఆర్‌ఎస్‌ 68 నుంచి 78 డివిజన్లలో జయకేతనం ఎగురవేయనున్నట్లు పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడించింది. టీఆర్‌ఎస్‌ 68- 78(ఓట్‌ షేర్‌ 38%), ఎంఐఎం 38-42 (ఓట్‌ షేర్‌ 13%), బీజేపీ 25-35 (ఓట్‌ షేర్‌ 32%), కాంగ్రెస్‌ 1-5 (ఓట్‌ షేర్‌ 12%), ఇతరులు- 5 శాతం ఓట్‌ షేర్‌ సాధించే అవకాశం ఉన్నట్లు పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. బీజేపీ గత జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పోల్చుకుంటే ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చినట్టుగా పీపుల్స్ పల్స్ ఎగ్జిట్‌పోల్స్‌లో వెల్లడించింది.

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు 28శాతం, నిరుద్యోగం 21 శాతం, వరద సాయం 16 శాతం, రోడ్లు 10 శాతం, పారిశుద్ధ్యం 9 శాతం, ఇతర సమస్యలు 4 శాతం ఎన్నికలను ప్రభావితం చేసినట్లు పీపుల్స్ పల్స్ తెలిపింది. ఇక.. మరో సర్వే సంస్థ ఆరా కూడా జీహెచ్‌ఎంసీ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకటించింది. టీఆర్‌ఎస్‌ 78(+/-7).. ఓట్‌ షేర్‌ 40.08 శాతం (+/-3), బీజేపీ 28(+/-5).. ఓట్‌ షేర్‌ 31.21 శాతం (+/-3), ఎంఐఎం 41(+/-5).. ఓట్‌ షేర్‌ 13.43 శాతం (+/-3), కాంగ్రెస్‌ 3(+/-3).. ఓట్‌ షేర్‌ 8.58 శాతం (+/-3) సాధించే అవకాశాలున్నట్లు అంచనా వేసింది.

Exit mobile version