end

పండుగకు ఊరెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించండి

  • సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ

సంగారెడ్డి: సంక్రాంతి పండుగకు ఊరు వెళ్తున్నారా..? అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ. బుధవారం పబ్లిక్ అనౌన్స్‌మెంట్ ఆటోను సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగారు ఆభరణాలు, డబ్బును బ్యాంకు లాకర్లలో భద్ర పరచుకోవాలన్నారు. లేదంటే వెంట తీసుకొని వెళ్లాలన్నారు. ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టం గల తాళం అమర్చుకోవాలని, ఊరు వెళ్లవలసి వస్తే స్థానిక పోలీస్ స్టేషనులో సమాచారము ఇవ్వాలని, కాలనీలో విధిగా సి.సి. కెమెరాలను అమర్చుకోవాలని తెలిపారు. రాత్రిపూట ఇంట్లో పడుకున్నపుడు తలుపు గడియ పెట్టుకోవడం మరిచిపోద్దన్నారు. వేసవిలో బంగారు నగలు ధరించి ఇంటి బయట గానీ, మిద్దె మీద గాని నిద్రించవద్దని తెలిపారు.

కాలనీలో ఎవరైనా అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాలని లేదా డయల్ 100 కు ఫోన్ చేయాలని సూచించారు. ఎవరైనా బంగారు వస్తువులు మెరుగు పెడ్తామని, శాంతి పూజలు చేస్తామని పూజలో బంగారు వస్తువులు పెట్టమని మాయ మాటలు చెప్తే.. నమ్మి మోసపోవద్దని, అలాంటి వారు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాలని డీఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేష్, ఎస్సైలు, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Exit mobile version