హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం చిరుజల్లుతో ప్రారంభమైన వర్షం మోస్తరుగా తర్వాత భారీగా మారింది. జూబ్లీహిల్స్, మూసాపేట్, కేపీహెచ్బీ, యూసుఫ్ గూడ, ఎస్సార్ నగర్, అమీర్ పేట్ తదితర ప్రాంతాల్లో వాన కురుస్తోంది. తెల్లవారుజామునే ప్రారంభమైన వానతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీస్ కు వెళ్లేవారు వానలోనే తడుస్తూ పయనమయ్యారు. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.అలాగే తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణి ప్రభావం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఫలితంగా కోస్తా, యానాం ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని అంచానా వేశారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. రానున్న రెండు రోజుల్లో ఉత్తర కోస్తాలో చాలా చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవవచ్చని అధికారులు అంచనా వేశారు.
గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షపాతాన్ని పరిశీలిస్తే నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 10.45 సెంటీమీటర్లు, సిద్దిపేట జిల్లాలో 6.80 వర్షపాతం నమోదైంది. నిర్మలా జిల్లా దస్తూరాబాద్లో 10.45, వడ్యాల్లో 10.38, పెంబిలో 10.28, కడెం పెద్దూర్ 9.38, మామ్డలో 8.70, బాసరలో 7.95, మంచిర్యాల జిల్లా కోటపల్లిలో 8.30, సిద్దిపేట జిల్లా శనిగవరంలో 8.23, రాఘవపూర్లో 6.80, వరంగల్ జిల్లా చెన్నరావుపేటలో 6.85 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.