end

నిలిచిపోనున్న ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌

  • 2022 జూన్‌ 15 నుంచి ఎక్స్‌ప్లోరర్11 డెస్క్‌ టాప్‌కు సపోర్టు నిలుపుదల
  • మైక్రోసాఫ్ట్‌ ప్రకటన

ప్రముఖ మైక్రోసాఫ్ట్‌ కు చెందిన వెబ్‌ బ్రౌజర్‌ ‘ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌’ సేవలు నిలిచిపోనున్నాయి. ఇంటర్నెట్ సేవలను ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన ఘనతను దక్కించుకున్న వెబ్‌ బ్రౌజర్ ఇక కనుమరుగు కానుంది. వెబ్‌ బ్రౌజర్‌ ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ను‌ నిలిపివేయాల్సిన సమయం ఆసన్నమైందని మైక్రోసాఫ్ట్‌ అధికారికంగా వెల్లడించింది. అయితే గత ఏడాది ఆగస్టులో మైక్రోసాఫ్ట్‌ 365, వన్‌ డ్రైవ్‌, ఔట్‌లుక్‌ వంటికి దీని సేవలు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన మైక్రోసాఫ్ట్‌.. 2022 జూన్‌ 15 నుంచి ఎక్స్‌ప్లోరర్11 డెస్క్‌ టాప్‌కు సపోర్టు చేయదని వెల్లడించింది. కాగా ఎక్స్‌ప్లోరర్‌ 1995, ఆగస్టులో విడుదలైంది. 2003లో 95 శాతం యూజర్ వాటాతో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే వెబ్ బ్రౌజర్ గా నిలిచింది.

అయితే ఫైర్‌ఫాక్స్, గూగుల్ క్రోమ్ ఈ పోటీలో దూసుకు రావడంతో దీని వాడకం అనేది తగ్గిపోయింది. అయితే గత ఆగస్టు నుంచి ఎక్స్‌ఫ్లోరర్‌ సపోర్టు చేయదని మైక్రోసాఫ్ట్‌ ప్రకటించగా, దీని స్థానంలో ఎడ్జ్‌ లెగస్సీ డెస్క్‌ టాప్‌ యాప్ తీసుకువచ్చారు. అయితే కొత్త సెక్యూరిటీ అప్ డేట్స్ పొందలేకపోవడంతో, ఎక్స్‌ఫ్లోరర్‌ పూర్తిగా కనుమరుగు కాలేకపోయింది. ఇక జూన్‌ 15, 2022 నుంచి పూర్తిగా దీని సేవలు నిలిచిపోనున్నట్లు తాజాగా మైక్రో సాఫ్ట్‌ ప్రకటించింది. దీనికి బదులుగా కొత్త మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌ కొత్త విండోస్ ఫీచర్ అప్ డేట్స్ తో అందుబాటులో ఉంటుందని తెలిపింది. మైక్రోసాఫ్ట్ ప్రకారం గూగుల్ క్రోమ్ మాదిరిగానే ఉండే కొత్త బ్రౌజర్‌ వేగంగా, సమర్ధవంతంగా పనిచేస్తుంది. జనవరిలో ఇది లాంచ్ అయినప్పటి నుంచి లక్షలాది మంది యూజర్లు తమ బ్రౌజర్‌లను మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌కు అప్‌గ్రేడ్ చేసుకున్నారు.

Exit mobile version