end

రాజ్యసభకు ఖుష్భూ..?

ప్రముఖ సినీనటి, రాజకీయనేత ఖుష్భూ సుందర్‌ రాజ్యసభకు ఎంపికవబోతున్నట్లు రాజకీయ వర్గాల టాక్‌. ఇటీవల బీజేపీలో చేరిన ఖుష్బూకు రాజ్యసభ సభ్యత్వం వరించనుంది. ఈ మేరకు బీజేపీ అధిష్టానవర్గం ఖుష్బూను కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపిక చేయాలని భావిస్తోంది. జూన్‌లో కర్ణాటకలో ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వారిలో ఒకరైన అశోక్‌ గస్తీ ఇటీవల కరోనా సోకి మృతి చెందారు. దీంతో కర్ణాటకలో ఒక రాజ్యసభ స్థానానికి ఎన్నిక జరగాల్సి వుంది. డిసెంబర్‌ ఒకటిన ఆ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ సీటుకు ఎవరిని ఎంపిక చేయాలన్న విషయమై బీజేపీ అధిష్టానవర్గం పార్టీ సీనియర్‌ నేతలతో చర్చలు జరుపుతోంది. కర్ణాటక నుంచి ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు రాజ్యసభకు ఎన్నిక కావడం ఆనవాయితీగా వస్తోంది. ఆ మేరకు తమిళనాడుకు చెందిన పార్టీ ప్రముఖుల్లో ఒకరిని రాజ్యసభకు ఎంపిక చేయాలని బీజేపీ అధిష్టానవర్గం నిర్ణయించింది. వచ్చే యేడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా రాష్ట్రానికి చెందిన పార్టీ ప్రముఖుల్లో ఒకరిని రాజ్యసభకు ఎంపిక చేస్తే సమంజసంగా ఉంటుందని, ఈ నిర్ణయం పార్టీ విజయానికి దోహదం చేస్తుందని బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా భావిస్తున్నారు.

Exit mobile version