కేంద్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్లో వ్యవసాయ రంగంలో డ్రోన్ల కోసం కేటాయించిన రూ.500 కోట్లు కేటాయించారు. ఈ నిధులు రాష్ట్రానికి మార్చి 31, 2023 నాటికి అందనున్నాయి. ఈ సందర్భంగా రైతులకు సబ్బిడీలో డ్రోన్లను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం వేగం గా సన్నాహాలు చేస్తుంది. కేంద్రం తీసుకొచ్చిన సబ్మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ పథకాన్ని రైతులకు వర్తింపజేయనుంది. కిసాన్ డ్రోన్లను ఉపయోగించి పంటలకు రసాయనాలను పిచికారి చేయవచ్చు. అదేవిధంగా పంటల లెక్కలను, భూముల రికార్డులను డిజిటల్ చేయవచ్చు. ఆధునిక వ్యవసాయంలో డ్రోన్ల ద్వారా పురుగు మందులు పిచికారీ చేస్తే రైతులకు సమయం ఆదా కావడమే కాకుండా, గణనీయంగా ఖర్చు తగ్గుతుందన్నారు. రాష్ట్రంలో మొదటి విడతగా 5 వేల డ్రోన్లను సబ్సిడీతో రైతులకు అందించనున్నారు. ఒక్కొక్క డ్రోన్ ఖరీదు రూ.8 నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుందని, సబ్సిడీ పోను మిగిలిన మొత్తానికి బ్యాంకు ద్వారా రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. అర్హత, ఆసక్తి కలిగినవారు జూలై 10లోగా దరఖాస్తు చేసుకోవాలి.
పురుగు మందుల్ని రైతులే స్వయంగా పిచికారీ చేయడం వల్ల అనేక దుష్ప్రభావాలకు గురి అవుతున్నారు. దీర్ఘకాలంలో అనారోగ్యం తో ఇబ్బంది పడుతున్నారు. డ్రోన్ పిచికారీ వీటన్నిటి నుంచి రైతుల్ని కాపాడుతుందని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది. కొన్ని పంటలకు మొక్కల పైన స్ప్రే చేస్తే సరిపోతుంది. కొన్నింటికి కాండం మొదల్లో స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఇలా ఒక్కో పంటకు ఒక్కో విధంగా ఉంటుంది. ఆ మేరకు డ్రోన్లకు అదనపు పరికరాలు సమకూరుస్తారు. పంటకు చీడపురుగులు ఏమైనా ఆశించాయా తెలుసుకునేందుకు కూడా డ్రోన్లను ఉపయోగించనున్నారు. ఈ నేపథ్యంలో పంటల్ని ఫొటోలు తీయడం, వాటిని వ్యవసాయాధికారికి పంపడం చేసేలా కూడా పరికరాలు అమర్చాలని అనుకుంటున్నారు. అలాగే కాత ఎలా ఉంది?, దిగుబడి ఏమేరకు వచ్చే అవకాశముంది?, ఇలా పంటకు సంబంధించిన ప్రతి అంశాన్నీ సూక్ష్మంగా పరిశీలిస్తూ పర్యవేక్షించేందుకు వీలుగా డ్రోన్లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు పలు కంపెనీలతోనూ చర్చించినట్లు తెలుస్తుంది.
డ్రోన్లను ఎవరికి పడితే వారికి ఇవ్వద్దు అని అధికారులు నిర్ణయించారు. పదో తరగతి పాసై ఉండాలి. డ్రోన్ పైలట్ శిక్షణ తీసుకొని ఉండాలి. అందుకు సంబంధించిన సర్టిఫికెట్ ఉండాలి. ఏవియేషన్ సర్టిఫికెట్ కూడా ఉండాలి. రైతుకైనా, రైతు కుటుంబంలో సభ్యులు ఎవరికైనా ఇస్తారు. నిరుద్యోగ యువతీ యువకులు కస్టమ్ హైరింగ్ సెంటర్ నడుపుతున్నట్లయితే వారికి ఇస్తారు. ప్రస్తుతం వ్యవసాయ యంత్రాలను ఎస్సీ, ఎస్టీలకు 95 శాతం సబ్సిడీతో ఇస్తున్నారు. ఇతర వర్గాలకు 50 శాతం సబ్సిడీతో ఇస్తున్నారు. అయితే డ్రోన్లకు ఎంతమేరకు సబ్సిడీ ఇవ్వాలన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రైతులు తమకు అవసరమైనప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంటుంది.