కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ పార్టీకి పట్టిన దరిద్రం పోయిందని ఎన్ఎస్యూఐ నేతలు సంబరాలు చేసుకున్నారు. గాంధీభవనలో బాణాసంచా కాలుస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కొద్దిరోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్కి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మంగళవారం క్లారిటీ ఇచ్చేశారు. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన త్వరలోనే స్పీకర్ని కలిసి రాజీనామా లేఖ సమర్పిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా తన పోరాటం కేసీఆర్ కుటుంబంపైనేనని ప్రకటించిన ఆయన తెలంగాణలో కుటుంబస్వామ్యం తప్ప ప్రజాస్వామ్యం లేదని ఆరోపించారు. టీఆర్ఎస్ అరాచక పాలనను అంతం చేయాలంటే ప్రధాని మోదీ, అమిత్ షా వల్లే సాధ్యమని వెల్లడించారు. కొన్ని తప్పుడు నిర్ణయాల వల్లే కాంగ్రెస్ తెలంగాణతో పాటు దేశంలోనే నష్టపోయిందని అభిప్రాయపడ్డారు.
ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆదేశాలతో కార్యకర్తలు మంగళవారం రాత్రి గాంధీభవన్లో సంబరాలు నిర్వహించారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీకి పట్టిన శని విరగడైందంటూ రాజగోపాల్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బాణాసంచా కాల్చారు. మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ఎన్ఎస్యూఐ నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు.