- సంక్షోభంలో మానవ జాతి ఉనికి
- కరోనా వైరస్ పట్ల నిర్లక్ష్యం తగదు
- వ్యాక్సిన్ వేయించుకున్నా జాగ్రత్తలు పాటించాల్సిందే
- విద్యార్థుల చదువులు, ఉద్యోగుల భవిష్యత్తు ఏమిటి?
ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి పట్ల ఇంకా చాలా మంది ప్రజలు, యువతీ యువకుల్లో నిర్లక్ష్యం నెలకొని ఉంది. గత సంతవ్సరం కాలంగా ప్రపంచ పరిస్థితులను, ఆర్థిక పరిస్థితులను, జీవన విధానాన్ని అతాలకుతలం చేసిన ఈ కరోనా వైరస్ పట్ల నిర్లక్ష్యం వద్దు. గత ఏడాది ఇటలీ, అమెరికా ఎదుర్కొన్న పరిస్థితులకంటే ఇండియాలో ఎక్కువయ్యే అత్యంత ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. పేదలు, ధనికులు అందరూ కాటికి పోయే దుర్భర పరిస్థితులను మనం ఇప్పుడు ఎదుర్కొంటున్నాము. ఎంత పెద్ద ధనికులైనా పరిస్థితి విషమించితే ఏమి చేయలేని పరస్థితి. ఎన్ని కోట్ల డబ్బు ఉన్నా ఆరోగ్య పరిస్థితి విషమిస్తే ప్రాణాలు కాపాడుకోలేకపోతున్న సంఘటనలు మనం గత ఏడాది నుండి చూస్తూనే ఉన్నాం. ఎంతో మంది రాజకీయ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ధనవంతులు, సెలబ్రెటీలు కరోనా వైరస్కు కొట్టుకుపోయారు.
ఇటలీ, అమెరికాలో అయితే శవాల దిబ్బలు పేరుకుపోయిన ఘటనలు మరువ గలమా. ఇప్పుడు భారత్ పరిస్థితి కూడా అత్యంత ప్రమాదంలో పడింది. ప్రపంచంలో జనాభా పరంగా ఇండియా రెండవది. జనసాంద్రత ఎక్కువ. వైరస్ వ్యాప్తి క్షణాల్లో జరిగిపోతుంది. ఎన్ని జాగ్రత్తలు పాటించినా కూడా కొన్ని సార్లు తెలియకుండానే వైరస్ అంటుకుంటోంది. సాధారణ ప్రజల విషయం పక్కన పెడితే విఐపిలు, ఎంపీలు, సీఎంలు కూడా కరోనా బారిన పడుతున్నారు. అత్యంత పకడ్బందీగా ఉండే ప్రముఖులు కూడా వైరస్ బారిన పడక తప్పడం లేదు. అంటే అర్థం చేసుకోండి. కరోనా వైరస్ గత సంత్సరం కంటే ఇప్పుడు చాలా బలపడింది. మనిషి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత పలు రూపాంతరాలు చెందుతోంది. దీనికి కచ్చితమైన వైద్యం చేయడం కష్టం. ఇప్పుడిస్తున్న టీకాలు కూడా 50 శాతం వరకే వైరస్తోపోరాడగలవు. మిగతా 50% వ్యక్తిగతంగా అత్యంత జాగ్రత్తలు తీసుకోవడం తప్పా ఏమి చేయలేం.
రోజు రోజుకు కరోనా వైరస్ బలపడుతోంది. ఇప్పుడు సెకండ్ వేవ్గా మారి చాలా తొందరగా విస్తరిస్తోంది. మున్ముందు ఇంకా ఎలాంటి పరిణామం చెందగలదో తెలియని పరిస్థితి. ఎన్నో లక్షల మంది ప్రణాలు కోల్పోయారు. ఇందుకు పేద, ధనిక మినహాయింపు కాదు. గత సంవత్సరం నుండి ప్రపంచ పరిస్థితులు మారిపోయాయి. ఇన్నేళ్ల అభివృద్ధి, టెక్నాలజీ ఏమి చేయలేకపోతోంది. ఆర్థిక పరిస్థితి చాలా అధ్వాన్నంగా మారింది. డబ్బులు సంపాదించడం ఏమోగానీ బతకడమే కష్టంగా మారింది. ఇన్నాళ్లు మనిషి మనిషులతో, దేశాలు ఇతర దేశాలతో యుద్ధాలు చేశారు గానీ ఇప్పుడు ప్రతీ మనిషి తనకు తనే యుద్ధాన్ని ప్రకటించుకున్నాడు. చాలా మంది మానిసక ఆందోళన, మానసిక జబ్బులకు గురవుతున్నారు. భవిష్యత్తుపై నిరాశతో యువత మానసికంగా బాధపడుతున్నారు. ఎవరిని చూసినా ఇదే పరిస్థితి… జీవితం పట్ల ఎవరు ధైర్యం చెప్పగలరు.
కలల ప్రపంచం చిన్నాభిన్నం అవుతూ ఉంది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువత, విద్యార్థులను నిరాశ, ఆందోళన వెంటాడుతున్నాయి. రెండేళ్లుగా విద్య అటకెక్కింది. ఎంతో మంది ఉద్యోగాలు పోయాయి. ఎన్నో వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. అసలే భారత్లో నిరుద్యోగం ఎక్కువ. ఇక ఇప్పుడున్న పరిస్థితి ఊహించరానిది. డబ్బులు సంపాదించడం దేవుడెరుగు. అసలు తిండిగింజలు కొనలేని పరిస్థితులు కూడా రావోచ్చు. ఇంట్లో వ్యక్తి, లేదా ఆప్తులు చనిపోయినా కడసారి కళ్లారా చూసుకోలేని ఈ దీన పరిస్థితి, అత్యంత దుర్భర పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరేమో. ఈ రోజు చనిపోయిన వారి శవాల పరిస్థితి చూస్తుంటే కళ్ల నుండి నీళ్లు కాదు రక్తం వస్తోంది. వీధి కుక్కలను మునిసిపాలిటీ వాళ్లు లాక్కెళ్లి తగులబెట్టినట్లు మనిషి శవాలను తగులబెడుతుంటే అసలు మానవ జాతి ఉనిక గురించి తీవ్రంగా ఆందోళన చెందాల్సి వస్తుంది.
అసలే మనిషి వివిధ రకాల రోగాలు, రొచ్చులతో చస్తుంటే ఈ కరోనా వైరస్ పెద్ద పెద్ద జబ్బులను వెనక్కి నెట్టేసి తానే నెంబర్ 1 జబ్బుగా ప్రకటించుకుంది. ఎంతో మంది తాత్కాలికంగా కోలుకున్నా వైరస్ జాడలను పూర్తిగా సంహరించడం సాధ్యమా? ఇదివరకులాగా మనిషి హాయిగా, స్వేచ్ఛగా గాలిపీల్చగలడా? ఇది ఎంతవరకు దారితీస్తుంది? మనుషుల భవిష్యత్తు ఏంటి?
ప్రభుత్వాలు, నాయకులు, అధికారులు, డాక్టర్లు వైరస్ నిర్మూలనకు ఏం చేస్తున్నారనేది పక్కనపెడితే ఒక బాధ్యత గల పౌరుడిగా, మనిషిగా సాధ్యమైనంత వరకు మన ప్రాణాలను మనమే కాపాడుకోవాలి. వ్యాక్సిన్లు వచ్చాయి ఇక ఏం భయం లేదు అనడానికి వీలులేదు. 135 కోట్ల జనాభాకు వ్యాక్సిన్లు ఇవ్వాలంటే ఎంత సమయం పడుతుంది? ఎన్ని డోసుల వ్యాక్సిన్లు తయారు చేయాలి? ఎంత ముడి సరుకు ఉంది? ఇవన్నీ ఆలోచించి ప్రతీ మనిషి తన జాగ్రత్తలో తాను ఉండాలి. ఈ కరోనా వైరస్ ఇప్పట్లో పోయేది కాదు. ఏ మాత్రం అలసత్వం వహించినా, నిర్లక్ష్యం చేసినా మన కుటుంబంలో గానీ, మన పక్కనే ఉండే స్నేహితులను గానీ, ఇరుగుపొరుగువారిని చంపేసిన పాపం మనకే తగులుతుంది. .
తస్మాత్ జాగ్రత్త
మనం తీసుకునే జాగ్రత్తల మీదే మన ప్రాణాలు ఆధారపడి ఉంటాయని మరిచిపోకండి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా కుటుంబాలను చిన్నాభిన్నం చేసే దరిద్రపు పరిస్థితి దాపురించిందని మరువకండి.
- ఫేస్ మాస్కులు ఖచ్చితంగా ధరించాలి, ప్రతీ రోజు మాస్కులను ఉతుక్కోవాలి.
- కచ్చితంగా భౌతిక దూరం పాటించండి. కనీసం 3 మీటర్ల దూరంగా ఉండి మాట్లాడండి.
- చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. చవకైన శానిటైజర్ కాకుండా కొంచెం బ్రాండెండ్ శానిటైజర్ (జెల్)ను వాడండి.
- ఇంట్లో కూడా దూరం పాటించాలి. ఒకరినొకరు ముట్టుకోవడం మానేయండి. అలాగే ఇంట్లోనే యోగా, ఎక్సర్సైజ్లు చేసుకోవాలి.
- సరదా షాపింగ్లు, అనవసర మీటింగ్లు మానేయండి.
- చిన్నపిల్లలు, వృద్ధులు, డయాబెటిక్, హృద్రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి/ఉంచాలి.
- ఇంట్లో ఉండి ఎక్కువగా టీవీలు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోకండి. అందుకు బదులు బుక్స్ చదవడం అలవాటు చేసుకోండి.
- ఇంట్లో వండిన భోజనం మాత్రమే చేయండి. సాధ్యమైనంత వరకు ఆన్లైన్ ఫుడ్ డెలివరీలు మానేయండి. దీంతో డబ్బులు కూడా ఆదా అవుతాయి.
- ఎక్కువగా పుల్లటి మజ్జిగ, పెరుగు, నిమ్మరసం, గ్రీన్ టీ, తులసీ ఆకు టీ, అల్లం టీ, మసాలా టీ తాగండి
- ఇంట్లో వండుకునే కూరలలో కొంచెం కారం ఎక్కువగా ఉండేవిధంగా చూసుకోండి.
- పెళ్లిళ్లు, వేడుకలు కొన్నాళ్లపాటు వాయిదా వేసుకోవడం ఉత్తమం. ముహుర్తాలు పోతే మళ్లీ పెట్టుకోవచ్చు. కానీ ప్రాణాలు పోతే తిరిగి రావు ఇది గుర్తుపెట్టుకోండి. మూర్ఖానికి పోయి ఆపదలో పడొద్దు. ఫంక్షన్లకు బందువులు రావడానికి కూడా ఇబ్బందే. ఒకవేళ మొహమాటానికి వస్తే కచ్చితంగా వైరస్ బారిన పడే ప్రమాదం ఉంటుంది.
- గుళ్లకు వెళ్లడం తగ్గించుకోవడం మంచిది. అందరి ఇళ్లలో దేవుని ఫోటోలు ఉంటాయి. ఇంట్లోనే దండం పెట్టుకోండి.
- ముఖ్యంగా మానసికంగా దృఢంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండండి. ప్రేరణకు సంబంధించి పుస్తకాలు చదవండి.
- ఇంట్లో ఖాళీగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. కనుక ఫోన్లలో మాట్లాడడం గాకుండా కొత్త కొత్త విద్యలు నేర్చుకోండి. కొత్త నైపుణ్యాలు ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా విద్యార్థులు టైమ్పాస్ చేయకుండా తరగతిలో ఉన్నట్లుగానే టైమ్ టేబుల్ రాసుకొని కచ్చితంగా పాటించండి.
- పెద్దలు కూడా ఊరికే టీవీలకు అతుక్కుపోకుండా పిల్లలపై దృష్టి సారించండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లల భవిష్యత్తు మీపైనే ఉంది. మీరెంత పకడ్బందీగా ఉంటేనే పిల్లలు చదువుతారు.
- గృహిణుల మీద ఇప్పుడు చాలా పెద్ద బాధ్యత ఉంది. ఎందుకంటే ఉద్యోగం చేసే భర్త లేదా కొడుకు లేదా కూతురు, పిల్లలు ఇంట్లో నుండే చదువులు, ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది. వారికి అందుకు అనుగుణంగా వాతావరణాన్ని కల్పించాలి. పౌష్టికాహారాన్ని అందించాలి.
- ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థికంగా నిలదొక్కుకోవడం చాలా అవసరం. అందుకని రోజువారి ఖర్చులు తగ్గించుకోండి. సరదా ఖర్చులు మానేయండి. పొదుపు చాలా అవసరం. అనవసర వస్తువులు కొనడం మానేయండి. అలాగే ఇప్పుడు చాలా కంపెనీలు 50 శాతం వరకు కాంట్రాక్టు బేస్ మీద వర్క్ ఫ్రం హోం అందిస్తున్నాయి. మనకు తెలిసిన వారితో సంప్రదించి ఏమైనా టెంపరరీ ఆన్లైన్ ఉద్యోగాలు దొరకుతాయేమో కనుక్కోండి. కొంత వరకు ఆదాయం సమకూరుతుంది.
- ముఖ్యంగా అద్దె ఇళ్లల్లో ఉండే వాళ్లు జాగ్రత్త. ఉద్యోగ భద్రత, ఆర్థిక భద్రత, ఆరోగ్యం కాపాడుకోవాలి. లేకపోతే ఓనర్లు ఇళ్లు ఖాళీ చేయించేస్తారు.
- ఇంట్లో కచ్చితంగా మెడిసిన్ కిట్టు ఉంచుకోవాలి. జ్వరం, జలుబు, దగ్గు, వొళ్లునొప్పులు ట్యాబ్లెట్లు, ఐడ్రాప్స్, సానిటైజర్ బాటిల్. శరీరంలో ఏ మాత్రం లక్షణాలు కనిపించినా ట్యాబ్లెట్లు వేసుకోండి. ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి అసలు తెచ్చుకోవద్దు.
- గది ఉష్ణోగ్రతలు సాధారణంగా 25 నుండి 26 డిగ్రీలు ఉండేటట్లు చూసుకోండి. మరీ ఎక్కువ వేడిగా గానీ, మరీ ఎక్కువ చల్లగా గానీ ఉండకూదు. ఏసీలు ఉన్నాయి కదా అని 18 డిగ్రీలు 17 డిగ్రీలు పెడితే ఒంట్లో వైరస్ తిష్టవేస్తుంది.
- గణేష్ వడ్ల