end

కేసీఆర్‌కు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏవైనా ఎన్నికలు జరుగుతున్నప్పుడే ప్రజలు గుర్తొస్తారని లేకపోతే ఫామ్ హౌస్‌కే పరిమితమౌతారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా విమర్శించారు. ఎన్నికలప్పుడే కాకుండా సాధారణ సమయంలోనూ ఫాంహౌస్‌లో కాకుండా ప్రజల మధ్య ఉండాలని కేసీఆర్‌కు చురకలంటించారు అమిత్‌ షా. శనివారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అమిత్‌షా మీడియాతో మాట్లాడారు. రోడ్ షోలో స్వాగతం పలికిన హైదరాబాద్‌ ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. సీట్లు పెంచుకోవడానికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. మేయర్ సీటు గెలుచుకోవడానికే పోటీ చేస్తున్నామన్నారు. బీజేపీ అభ్యర్థే మేయర్ అవుతాడని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ హబ్‌గా మారుస్తామన్నారు. ఎంఐఎం అండతోనే అక్రమ కట్టడాలు ఏర్పాటయ్యాయని, ఎంఐఎం మార్గదర్శనంలోనే టీఆర్ఎస్ నడుస్తోందన్నారు. బీజేపీకి అవకాశమిస్తే.. హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలన్నీ కూల్చేస్తామన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నిధులిస్తోందని, సిటీలో వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ఎవరితోనూ సమావేశం కాలేదని విమర్శించారు. తన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.

గత ఎన్నికల తర్వాత వంద రోజుల ప్రణాళిక అన్నారు.. ఏమైంది? లక్ష ఇళ్లు కడతామన్నారు.. ఏమైంది? ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ నెరవేర్చలేకపోయింది. హుస్సేన్‌ సాగర్‌ను శుద్ధి చేస్తాం.. పర్యాటక కేంద్రంగా మారుస్తాం అన్నారు. ఈ హామీలన్నీ ఏమయ్యాయి అని అమిత్‌ షా కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. ప్రజలకు ఆయుష్మాన్ భారత్‌ ఫలాలు అందకుండా అడ్డుకున్నారు’ అంటూ విమర్శలు చేశారు.

Exit mobile version