ఇప్పటికే తొలి బోనాలు ఉత్సవం గోల్కొండ(Golkonda)లో జూలై 3న జరిగింది. రేపు ఆదివారం లష్కర్, జూలై 17న లాల్ దర్వాజ, జూలై 24న పాతబస్తీలో బోనాలు జరగనున్నాయి. ఆషాఢ మాసం రావడంతోనే హైదరాబాద్లో బోనాల పండుగ మొదలు అవుతుంది. బోనాల పండుగ అంటేనే ఎక్కడ లేని ఉషారు వస్తుంది.ప్రతి ఏటా నిర్వహించే ఈ ఉత్సవాలు ఈసారి ఇంకా ఘనంగా జరుగుతున్నాయి. మొదట్లో కేవలం భక్తులకే పరిమితమైన బోనాల పండుగకు కొన్నేళ్లుగా రాజకీయ పార్టీల హడావిడి కూడా తోడయ్యింది. ఈ ఏడాది ఆషాఢమాసం(Ashadam) బోనాలు జూన్ 30న ప్రారంభమయ్యాయి. జూలై 28 వరకూ కొనసాగనున్నాయి. తొలి బోనం జగదాంబిక అమ్మవారి(Jagadambika Ammavaru)కి సమర్పించారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి పట్టువస్త్రాలు సమర్పించారు.
బోనం అంటే ఏంటి?
భోజనం ప్రకృతి అయితే దాని వికృతి పదమే బోనం. అన్నం, పాలు, పెరుగుతో కూడిన బోనాన్ని అమ్మవారి కోసం మట్టి లేదా రాగికుండలో వండుతారు. ఆ తర్వాత బోనాల కుండలను వేప రెమ్మలతో, పసుపు, కుంకుమతో అలంకరించి దానిపై ఒక దీపం ఉంచుతుంటారు. ఇలా తయారు చేసిన బోనాలను తలపై పెట్టుకుని డప్పు చప్పుళ్లతో మహిళలు ఆలయానికి తీసుకెళ్తారు. ఈ బోనాల కుండలను ఇలా బోనం నైవేద్యంగా సమర్పించే తంతును ఊరడి అంటారు. గ్రామాల్లో దీన్నే పెద్ద పండుగ(Festival), ఊరీ పండుగ వంటి పేర్లతో పిలుస్తారు. బోనాల జాతర కేవలం అమ్మవారికి నైవేద్యం సమర్పించడంతోనే ముగిసిపోదు. గ్రామీణ సంబరాలకు సంబంధించిన ప్రతి ఘట్టమూ ఇందులో కనిపిస్తుంది. తొట్టెల పేరుతో అమ్మవారికి కర్రలు, కాగితాలతో చేసిన అలంకారాలు సమర్పించడం, రంగం పేరిట భవిష్యవాణి(Prophecy) చెప్పే ఆచారమూ ఈ బోనాల పండుగలో ఉంటుంది. అమ్మవారిని ఘటం రూపంలో స్థాపించడం, ఆ ఘట్టాన్ని నిమజ్జనం(Immersion) చేయడమూ మనం చూడవచ్చు. మొత్తం మీద జానపద కళలు, డప్పుల చప్పుళ్లు, శివసత్తుల విన్యాసాలతో పండుగ వాతావరణం కనిపిస్తుంది. బోనాలకు హైదరాబాద్ నగరం ప్రసిద్ధి చెందినప్పటికీ తెలంగాణ(Telangana) అంతటా ఈ పండుగను జరుపుకుంటారు. గ్రామ దేవతలకు పసుపు కుంకుమలు, చీరసారెలు, భోజన నైవేద్యాలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ ఇలా శక్తి స్వరూపమైన అమ్మవార్ల వద్ద తమను చల్లగా చూడమని వేడుకుంటారు. తమ కుటుంబానికి, గ్రామానికి ఏ ఆపద రాకుండా రక్షించమని ప్రార్థిస్తారు. ప్రతి ఆదివారం ఒక్కొక్క ప్రదేశంలో బోనాల జాతర జరుపబడుతుంది.
ఈ ఉత్సవం ముందుగా గోల్కొండలో కొలువై ఉన్న మహంకాళీ దేవాలయంలో ప్రారంభమై, సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయం, హైదరాబాద్ పాతబస్తీలోని ‘షాలిబండ’లో కొలువై ఉన్న అక్కన-మాదన్న మహంకాళీ దేవాయం, ‘లాల్దర్వాజ’ లోని మహాంకాళీ అమ్మవారి దేవాలయం, బల్కంపేట ఆలయం, మొదలైన పలు ప్రధాన దేవాలయాలలో వరుసగా కనుల పండుగగా జరుగుతుంది. ఇప్పటికే తొలి బోనాలు ఉత్సవం గోల్కొండలో జూలై 3న జరిగింది. రేపు ఆదివారం లష్కర్, జూలై 17న లాల్ దర్వాజ, జూలై 24న పాతబస్తీలో బోనాలు జరగనున్నాయి. 18న రంగం, భవిష్యవాణి కార్యక్రమం నిర్వహిస్తారు