end

సినీ ప్రియులకు సూపర్‌ న్యూస్‌..

హైదరాబాద్‌: సినిమాను ప్రేమించే, ఆరాధించే అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. కరోనా కారణంగా గత పది నెలలుగా రాష్ట్రంలో సినిమా థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో థియేరట్ల పునః ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 50 మంది ప్రేక్షకులతో కంటైన్మెంట్‌ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో థియేటర్లు తెరవవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. సినిమా హాళ్లలో మాస్క్‌, శానిటైజర్‌ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించింది. అలానే ఏసీ 24 నుంచి 30 డిగ్రీలు ఉండేలా చూడాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి షోకు ముందు థియేటర్ల పరిసరాలను శానిటైజేషన్‌ చేయడం తప్పనిసరి అని ఆదేశించింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి రానున్నాయి.

ఇక ఇప్పటికే టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో సీఎం కేసీఆర్‌ సినిమా థియేటర్ల యజమానులకు పలు వెసులుబాట్లు కల్పించిన సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా టికెట్‌ ధర పెంచుకోవచ్చని తెలపడమే గాక విద్యుత్‌ కనీస డిమాండ్‌ ఛార్జీలు రద్దు చేస్తామని పేర్కొన్నారు. 10 కోట్ల రూపాయల లోపు బడ్జెట్‌ సినిమాలకు ఎస్‌జీఎస్‌టీ రీయింబర్స్‌మెంట్‌తో సాయం చేస్తామని మేనిఫెస్టోలో తెలిపారు. రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో అధిక షోలు ప్రదర్శించేందుకు అనుమతిస్తామని ప్రభుత్వం తెలియజేసింది.

Exit mobile version