వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ వైసీపీ కార్యాలయం నుండి ఆదేశాలు జారీ చేశారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు పార్టీ కార్యాలయ అధికార ప్రతినిధులు వెల్లడించారు. ఇటీవల జరిగిన నరసాపురం జిల్లా సాధన సమితి ఉద్యమంలో సుబ్బరాయుడు పాల్గొన్నారని, ఇదేగాకుండా వైసీపీ ఎమ్మెల్యే ప్రసాద్రాజుపై బహిరంగంగా విమర్శలు చేయడం, పరోక్షంగా పార్టీని అవమానించడం వంటి చర్యల వల్ల సుబ్బరాయుడిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
సుబ్బరాయుడు నరసాపురంలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. 2024లో వైసీపీ పార్టీ నుండి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా తాను పోటీ చేస్తానని తప్పకుండా విజయం సాధిస్తానని మాట్లాడారు. నియోజకవర్గం ప్రజల్లో తనకంటు ప్రత్యేక ఓటు బ్యాంకు ఉందని తెలిపారు. ఇదివరకు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా సొంత ప్రజా బలంతోనే గెలిచి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉందని గుర్తు చేశారు. నరసాపురం జిల్లా కేంద్రం చేయాలని శాంతియుతంగా ఉద్యమం చేస్తే తనను ఏ-1గా చేయడం చాలా బాధాకరవిషయమని వాపోయారు.
నరసాపురం జిల్లా సాధనలో వైసీపీ ఎమ్మెల్యే ప్రసాద్రాజు విఫలమయ్యారని విమర్శించారు. కేసుల గురించి తాను పట్టించుకోనని ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతానని తెలిపారు. జిల్లా సాధనకోసం కృషి చేస్తానని సుబ్బరాయుడు వివరించారు.